న్యూఢిల్లీ, జూలై 20 : రిలయన్స్ ఇండస్ట్రీస్ రానున్న రెండేళ్లలో 20 కోట్ల 4జీ ఫీచర్ ఫోన్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2 జీ మొబైల్ వినియోగదారులనే లక్ష్యంగా రూ.1000-1500 ధరలలో ఫోన్లను విడుదల చేసే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఫోన్లను రిలయన్స్ రిటైల్ ద్వారా విక్రయిస్తారా లేదా జియో ద్వారా అన్నది ఇంకా తేలలేదు. రిలయన్స్ ఇంకా ఫీచర్ ఫోన్ల ధరను నిర్ణయించలేదు కాని సుమారు వాటి ధర రూ.1000-1500 శ్రేణిలో ఉండొచ్చని అంచనా. జియో నుంచి టీవీ, జియో మనీ వంటి యాప్లతో ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అడుగుపెట్టవచ్చు అని తెలిపారు. దీనికి స్మార్ట్ఫోన్ల మాదిరి టచ్ స్క్రీన్ ఉండకపోయినప్పటికీ వై-ఫై, బ్రౌజింగ్ సదుపాయాలు ఉంటాయని అంతేకాకుండా ఈ మొబైల్ ను టీవీతో కేబుల్ ద్వారా అనుసంధానం చేసి జియో టీవీని వీక్షించవచ్చని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.