హైదరాబాద్ : భారత్ జట్టు యువ క్రికెటర్ పృథ్వీ షా అరంగేట్రం లోనే సెంచరీ చేసి తన ప్రతిభను చూపాడు. పృథ్వీ షాలో దిగ్గజ బ్యాట్స్మెన్ సచిన్, సెహ్వాగ్, లారాలు కనిపిస్తున్నారని భారత కోచ్ రవిశాస్త్రి అన్నారు. 'పృథ్వీ క్రికెట్ ఆడేందుకే పుట్టినట్లున్నాడు. ముంబైలోని మైదానాల్లో ఎనిమిదేళ్ల ప్రాయం నుంచే క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. అతనిలో కష్టపడాలన్న తపన కనిపిస్తోంది. అతను ఆడే షాట్లలో సచిన్... వొక్కోసారి సెహ్వాగ్, లారాలు కనిపిస్తున్నారు. కెరీర్ తొలినాళ్లలోనే వచ్చిన కిక్కును తలకెక్కించుకోకుండా ఇలాగే కష్టపడితే అతనికి మంచి భవిష్యత్తు ఉంటుంది 'అని, అలాగే ఉమేష్ యాదవ్ ని కూడా తన ప్రశంసలతో ముంచెత్తాడు. 'జట్టుకు తాను విలువైన బౌలర్నని ఉమేశ్ తాజా ప్రదర్శనతో చాటుకున్నాడు. ఓపెనర్ రాహుల్ టచ్లోకి వచ్చాడు. అతను ప్రపంచశ్రేణి బ్యాట్స్మన్. కొన్నిసార్లు బాగా కష్టపడతాడు. ఈ మ్యాచ్లో నాకదే కనిపించింది. ఈ వరుసలో తాజాగా రిషభ్ పంత్ వచ్చాడు. అందివచ్చిన అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకున్నాడు' అని రవి శాస్త్రి పేర్కొన్నాడు.