హైదరాబాద్: మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ సోమవారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎల్ రమణమను కలిశారు. ఆయన పఠాన్చెరు టిక్కెట్ ఆశీస్తున్నారు. ఇటీవల టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును అమరావతిలో కూడా కలిశారు.
‘మహాకూటమి’ సీట్ల కేటాయింపులో భాగంగా పఠాన్ చెరు టికెట్ టీడీపీకి రానుండటంతో నందీశ్వర్ గౌడ్ అనూహ్యంగా ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన ఆ తర్వాత బీజేపీలో చేరారు. అనంతరం మళ్లీ సొంతగూటికి చేరేందుకు మంతనాలు జరిగినా...చివరకు ‘సైకిల్’ను ఫిక్స్ చేసుకున్నారు.
కాగా ఎల్.రమణతో భేటీ అనంతరం నందీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ... ఇటీవల తాను అమరావతిలో చంద్రబాబు నాయుడును కలిసింది వాస్తవమేనని అన్నారు. ఆ నెల 19న అధికారికంగా టీడీపీలో చేరనున్నట్లు తెలిపారు. తన రాజకీయ ప్రస్థానం మండలాధ్యక్షుడిగా ప్రారంభమైందని, అది దివంగత నేత ఎన్టీఆర్ చలవ వల్లేనని అన్నారు. ఆ తర్వాత అంచలు అంచెలుగా ఎదుగుతూ ఎమ్మెల్యే స్థాయిని అందుకున్నట్లు చెప్పారు. అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తానని నందీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. కేఈ కృష్ణమూర్తితో బంధుత్వానికి ...పార్టీ మార్పుకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు.