ఆంధ్ర ప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా తాను సిద్ధంగా ఉన్నాను , చంద్రబాబు, జగన్ సిద్ధమేనా? అని జనసేన పార్టీ అధినేత కల్యాణ్ ప్రశ్నించారు. పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ,రానున్న పంచాయతీ ఎన్నికల్లో ఆడపడుచులకు అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.
వచ్చే ఎన్నికల లోపు కొయ్యలగూడెంను నగర పంచాయతీగా ప్రకటించాలని పవన్ డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదని, నిర్వాసితుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. పొగాకు రైతులు, కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీ అధికారంలోకొచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే గిరిజన, గిరిజనేతర యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, ఆడపడుచుల కష్టం తెలుసుకుని ’ఉచిత గ్యాస్ పథకం’ పెట్టానని అన్నారు.