కర్ణాటకలో దారుణ హ‌త్య

SMTV Desk 2018-09-30 18:02:07  Karnataka, Murder,

మండ్య జిల్లా మళవళ్లి తాలూకా చిక్కబాగిలు గ్రామంలో దారుణ హ‌త్య జ‌రిగింది. పశుపతి, గిరీశ్ అనే ఇద్ద‌రు మంచి మిత్రులుగా పేరు తెచ్చుకున్నారు. ఐతే రెండు రోజుల కిందట ఓ సంఘటనకు సంబంధించి గిరీశ్‌‌- పశుపతి తల్లి మధ్య ఘర్షణ తలెత్తింది. ఆ సమయంలో ప‌శుప‌తి త‌ల్లిని గిరీశ్ దూషించినట్టు స‌మాచారం. ఈ సంఘటన స్నేహితులిద్దరి మధ్య గొడ‌వ‌కు దారితీసింది. ఆ గొడ‌వ‌ను సీరియ‌స్‌గా తీసుకున్నప‌శుప‌తి, గిరీశ్‌ను హ‌త‌మార్చాల‌ని స్కెచ్ వేశాడు. స‌ర‌దాగా వెళ‌దామంటూ గిరీశ్‌ను స‌మీపంలోని కొళతూరు గ్రామం వరకు తీసుకెళ్లాడు. అక్కడ వాహనాన్ని నిలిపి.. కత్తితో గిరీష్‌ తల నరికాడు. హత్యానంతరం తలను తీసుకుని నిందితుడు 22 కిలోమీటర్ల దూరం ప్రయాణించి నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. మళవళ్లి గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తన తల్లిని నానా దుర్భాషలాడినందుకే హతమార్చినట్లు నిందితుడు పశుపతి పోలీసులకు చెప్పాడు.