మరోసారి సర్జికల్ స్ట్రైక్స్?

SMTV Desk 2018-09-30 11:57:37  Surjical Strike, Pakistan Border, Raj Nath SIngh, Home Minister

పాక్ భూభాగంలో భారత్ మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేయడానికి సిద్దం అవుతోందా? అంటే అవుననే అనుకోవలసి వస్తుంది కేంద్రమంత్రి హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ మాటలు వింటే. యూపిలో ముజఫర్ నగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, “పాకిస్తాన్ మన పొరుగుదేశం. కనుక పాక్ సైనికులపై ఎన్నడూ మొదట కాల్పులు జరుపవద్దని సరిహద్దు వద్ద కాపలా కాస్తున్న మన జవాన్లను ఆదేశించాను. కానీ పాక్ సైనికులు కాల్పులు జరుపుతుంటే బుల్లెట్లు లెక్కపెడుతూ చేతులు ముడుచుకొని కూర్చోవద్దని ధీటుగా బదులిమ్మని ఆదేశించాను. మన జవాన్లు ఎప్పుడూ నియంత్రణ పాటిస్తూనే ఉన్నారు కానీ పాక్ జవాన్లు చెలరేగిపోతున్నారు. ఇటీవల మన జవాను నరేంద్ర కుమార్ ను వారు ఎంత దారుణంగా హత్య చేశారో అందరూ చూశారు. తమ సహచరుడి హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని మన జవాన్లు రగిలిపోతున్నారు. అందుకు సమయం ఆసన్నమైందని భావిస్తున్నాను. రెండు మూడు రోజుల క్రితం ఎవరూ ఊహించలేని ఒక పరిణామం జరిగింది. దాని గురించి ఇప్పుడే చెప్పలేను కానీ త్వరలో మీకే తెలుస్తుంది,” అని చెప్పారు.