న్యూఢిల్లీ, జూలై 19 : గృహాల కొనుగోలుదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఒక ప్రత్యేకమైన పోర్టల్ ను ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా 3000 లకు పైగా ఆమోదించిన ప్రాజెక్టుల వివరాలను ఈ వెబ్సైట్లో పొందుపరిచింది. వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడానికి ఇందులో భాగంగా గృహాల కొనుగోలుదారుల కోసం www.sbireally.in అనే సైట్ ను ప్రారంభించామని బ్యాంక్ తెలిపింది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 30 నగరాల్లో బ్యాంక్ ఆమోదించిన ప్రాజెక్టులు ఉన్నాయని వివరించింది. ప్రస్తుతం ఈ వెబ్సైట్లో 9.5 లక్షల గృహ యూనిట్లు అందుబాటులో ఉండగా ఆ సమాచారాన్ని వెబ్సైట్లో ఉంచినట్లు ఎస్బీఐ తెలిపింది. వినియోగదారులకు అదనపు విలువలను చేకూర్చనున్నామని ఎస్బీఐ ఎండీ రజనీష్ కుమార్ తెలుపుతూ గతంతో పోలిస్తే ప్రస్తుత ధరలను అంచనా వేసుకోవచ్చని సూచించింది.