విజయవాడ : ప్రస్తుతమున్న పరిస్థితుల్లో చూస్తే సీఎం అవ్వాలన్న వైఎస్ జగన్ చిరకాల కోరిక నెరవేరేడట్టే కనపడుతోంది. తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పై ఇండియా టుడే సర్వే ఫలితాలు అత్యంత ఆసక్తిగొలిపే విధంగా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏపీలో వైసీపీకి ఓటేస్తామని రాష్ట్రవ్యాప్తంగా 43 శాతం మంది వెల్లడించినట్లు సర్వే ఫలితాలు తెలిపాయి. అధికార తెలుగుదేశానికి 38 శాతం మంది, జనసేన పవన్కు 5 శాతం మంది జై కొట్టారు. ఈ నెల 8 నుంచి 12 వరకూ రాష్ట్రవ్యాప్తంగా 10,650 మంది అభిప్రాయాలను సేకరించి ఈ సర్వే ఫలితాలను ప్రకటించారు. ఈ సర్వేలో చంద్రబాబు ప్రభుత్వం పనితీరు బాగుందని 33 శాతం మంది చెప్పగా, బాగోలేదని 36 శాతం మంది.. యావరేజ్గా ఉందని 18 శాతం మంది వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి సీఎంగా జగన్ కావాలంటూ 40 నుంచి 41 శాతం కోరగా చంద్రబాబుకే తిరిగి అవకాశం కల్పించాలని.. 39 నుంచి 40 శాతం మంది అభిప్రాయాన్ని వెల్లడించారు. మరో వైపు తెలంగాణలో సీఎం కేసీఆర్ కు మరో సారి ప్రజలు పట్టం కట్టడం ఖాయమని సర్వే స్పష్టం చేసింది. తెలంగాణ తదుపరి సీఎం ఎవరు అన్న ప్రశ్న 43 శాతం మంది కేసీఆర్ కు ఓటేయగా.. 18 శాతం ఉత్తమ్కుమార్ రెడ్డికి.. 15 శాతం కిషన్ రెడ్డికి ఓటేశారు.