ముంబై, జూలై 18 : అండర్ వరల్డ్ ముంబై డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘హసీనా-ది క్వీన్ ఆఫ్ ముంబై’. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రద్దా కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కాగా ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ని ముంబైలోని మరాఠా మందిర్లో విడుదల చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల అక్కడ విడుదల చేయలేకపోయారు. ఈ సినిమాలో దావూద్ చేసే దారుణాల వల్ల అతని సోదరి హసీనా పడిన కష్టాలను ఎక్కువగా చూపించనున్నారు. ముంబై లోని నాగ్పాడా ప్రాంతంలో హసీనాను అప్పా అని పిలుస్తారట. ఇప్పటికీ అక్కడి ప్రజలు అప్పా అనే పేరు వింటేనే హడలిపోతారట. ట్రైలర్లో "మీరు నా అన్న గురించి చదివారు, కానీ నేను నా అన్ననే చదివాను" అనే డైలాగ్ హైలెట్గా నిలిచింది. దావూద్ పాత్రలో శ్రద్ధా తమ్ముడు సిద్ధాంత్ కపూర్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 18న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.