అమరావతి: తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ముఖ్యమంత్రి యువనేస్తం వెబ్సైట్ను ఈ నెల 14 న ప్రారంభించనున్నారు. ఈ సందర్బంగా మంగళవారం జరిగిన శాసన మండలి లో ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి లోకేశ్ మాట్లాడుతూ వెబ్సైట్ వివరాలను వెల్లడించారు. నిరుద్యోగులు ఈ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని, ఇందుకోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదని, ఇంట్లో కూర్చునే ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చని అన్నారు. వెబ్సైట్లో నమోదు చేసే సమయంలో సమస్యలు తలెత్తితే ఫిర్యాదు నేరుగా 1100కు వెళ్తుందని, ఆ సమస్యను తక్షణమే పరిష్కరించేలా ఏర్పాట్లు చేశామని చెప్పారు. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రానికి 2705 పరిశ్రమలు రాబోతున్నాయని తెలిపారు. యువనేస్తం వెబ్సైట్లో నిరుద్యోగుల ప్రొఫైల్స్ సిద్ధంగా ఉంటాయని, పరిశ్రమల అవసరాన్ని బట్టి ఉద్యోగాలు ఇస్తారని తెలిపారు. క్రమ క్రమంగా నిరుద్యోగులందరికి ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు.