విశాఖపట్టణం శివార్లలోని కంచరపాలెంలో వైఎస్ జగన్ బహిరంగ సభకు ప్రజలు తరలి వచ్చారు. విశాఖ వాసులు జగన్ కు ఘనస్వాగతం పలికారు. ఎటు చూసినా ఖాళీ స్థలం కనిపించడం లేదని, రోడ్లు, వీధులు, బిల్డింగ్ లపైనా.. అన్నీ ప్రజలతో నిండిపోయిందని, వారు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు రెండు చేతులు జోడించి తన కృతఙ్ఞతలు చెబుతున్నానని వైసీపీ అధినేత జగన్ అన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ, తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో విశాఖపట్టణం టాప్ గేర్ లో దూసుకుపోయిందని, అదే, చంద్రబాబు హయాంలో రివర్స్ గేర్ లో వెనుకకు నడుస్తోందని ఇక్కడి ప్రజలు తనకు చెప్పారని అన్నారు. వైఎస్ఆర్ మరణం తర్వాత విశాఖలో అభివృద్ధి మందగించిందని, నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, ఆయన ఇచ్చిన హామీలకు దిక్కూదివాణం లేకుండా పోయిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సభ సందర్భంగా విశాఖ నగరంలో పలుచోట్ల భారీ ఎల్ ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. విశాఖలోని వైఎంసీఏ, గోకుల్ పార్క్, సీఎంఆర్, సెంట్రల్ పార్క్, శివాజీ పార్క్, ఎన్ఏడీ జంక్షన్, గాజువాక జంక్షన్ లలో ఈ భారీ ఎల్ డీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.