* కేసీఆర్ పై జానా రెడ్డి ఫైర్ హైదరాబాద్ : కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత జానారెడ్డి మండి పడ్డాడు. హుస్నాబాద్ బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ ‘ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జానారెడ్డి.. వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తే గులాబీ కండువా కప్పుకొని ప్రచారం చేస్తానని అసెంబ్లీలోనే అన్నారు. జానారెడ్డికి నిజాయతీ ఉంటే ఈరోజు ఆ పనిచేయాలని నేను డిమాండ్ చేస్తున్నా.’ అని అన్నారు. ఈ సందర్బంగా జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ 24 గంటలు కరెంట్ ఇస్తే గులాబీ జెండా కప్పుకుంటానని అసెంబ్లీలో తాను అనని మాటలను అన్నట్లు చెబుతున్నారని ఆరోపించారు. గులాబీ జెండా కప్పుకుంటానని తాను అన్నట్లు ఉంటే.. ఆ రికార్డులు తెప్పించి ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. తాను అన్నట్లు రుజువు చేస్తే 24 గంటల్లోనే అస్త్ర సన్యాసం చేస్తానని స్పష్టం చేశారు. 24 గంటల్లోగా కేసీఆర్ రుజువు చేయాలని... లేకపోతే వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు ఓటమి తప్పదని ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు.