న్యూఢిల్లీ: రాబోయే ఎన్నికల్లో కేసీఆర్కు ప్రజలే బుద్ధిచెబుతారని సీపీఐ నేత సురవరం అన్నారు. ముందస్తు ఎన్నకల నేపథ్యంలో కేసీఆర్ మాట్లాడిన తీరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని అన్నారు.ఈ సందర్బంగా శుక్రవారం కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఓపీ రావత్తో సీపీఐ నేతలు భేటీ అయ్యారు. అనంతరం సురవరం మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు జరగాలో ఈసీ నిర్ణయిస్తుందన్నారు. విపక్ష నేతలను సన్నాసులు అని తిట్టే కుసంస్కారి కేసీఆర్ అని మండిపడ్డారు. ఎన్నికల షెడ్యూల్ ఈసీ మాత్రమే ప్రకటించాలని, కేసీఆర్ ఎలా ప్రకటిస్తారని సీపీఐ నేత సురవరం ప్రశ్నించారు. దీనిపై సీఈసీ ముందు తీవ్ర అభ్యంతరం తెలిపామని ఆయన అన్నారు. దీనిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని వారు కోరినట్లు తెలిపారు. తెలంగాణాలో పొత్తుల విషయంలో ఇతర రాజకీయ పార్టీలతో చర్చిస్తున్నట్లు ఈ సందర్బంగా వారు తెలిపారు.