దేశ రాజధాని దిల్లీ, గుర్గాన్ ప్రాంతాలను మంగళవారం ఉదయం భారీ వర్షాలు ముంచెత్తాయి. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా...ఒక్కసారిగా కురిసిన వర్షాలు దిల్లీ ప్రజలకు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి. మెరుపులతో కూడిన భారీ వర్షం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాలు, తీన్మూర్తి భవన్, ఆర్కే పురం సహా పలు ప్రాంతాలను ముంచెత్తింది. కుండపోతతో దౌల కున్, పలాం మోద్ ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలిచిపోయింది. పలు చోట్ల రోడ్లపై మోకాలి లోతు వరకు వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల రోడ్లపై చెట్లు కూలిపోయాయి.విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పలు ప్రాంతాలు అంధకారమయ్యాయి. మరోవైపు ఢిల్లీ సహా తెలంగాణ, ఉత్తరాఖండ్, హర్యానా, చండీగర్, ఢిల్లీ, యూపీ, తూర్పు రాజస్థాన్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్యరాష్ట్రాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది.