న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా జరుగుతున్న 14 వ రాష్ర్టపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. అటు పార్లమెంట్ లో ఇటు తెలంగాణ శాసనసభలోనూ ఎన్నికల ప్రక్రియను పోలింగ్ అధికారులు ప్రారంభించారు. పార్లమెంట్ లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్ లో మోదీ తొలి ఓటు వేశారు. ఆ తర్వాత శాసనసభ అధికార పక్షాన రామ్నాథ్ కోవింద్, విపక్షాల తరపున మీరా కుమార్ రాష్ట్రపతి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఈ నెల 20న ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. ఎమ్మెల్యేల సెల్ఫోన్లు, పెన్నులను అధికారులు పోలింగ్ బూత్లోకి అనుమతించడం లేదు. రాష్ట్రపతిని ఎన్నుకునేవారిలో 233 మంది రాజ్యసభ సభ్యులు, 543 మంది లోక్సభ సభ్యులు, 4120 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఆంగ్లో-ఇండియన్ల తరఫున లోక్సభకు నామినేట్ అయ్యే ఇద్దరు సభ్యులు, రాజ్యసభలో ఉండే 12 మంది నామినేటెడ్ సభ్యులు ఈ ఎన్నికల్లో ఓట్లు వేయడానికి అనర్హులు. రాష్ట్రాల శాసనమండలుల సభ్యులకూ ఓటుహక్కు లేదు. ఎన్నికను రహస్య బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించనున్నందువల్ల ఫలానా అభ్యర్థికే ఓటు వేయాల్సిందిగా ఏ పార్టీ కూడా తమ సభ్యులకు విప్ జారీ చేయడం కుదరదు. ఏ అభ్యర్థీ తాము ఫలానా వారికి ఓటు వేశామని వెల్లడించడానికి వీల్లేదు.