ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా అవసరమని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీని ఇతర రాష్ట్రాలతో పోల్చవద్దని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారని చెప్పారు. టీడీపీతో పొత్తు అనేది రూమర్ అని రఘువీరా రెడ్డి తెలిపారు. సీడబ్ల్యుసీ మీటింగ్లో ఏపీ ప్రత్యేక హోదా అంశం మీద రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు ఇచ్చిన హామీ వీడియోను విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని, వేరే రాష్ట్రంతో పోల్చుకోవద్దని, సోనియా, రాహుల్ అన్నట్లు తెలిపారు. ఈ విషయంపై సోనియా, రాహుల్ గాంధీలకు ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్ ఆదాయం ఏపీకి రాకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయని ఆయన అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ను ఇరుకున పెట్టాలని టీఆర్ఎస్ చూస్తోందని విమర్శించారు.వచ్చే ఎన్నికల్లో 25 లోక్సభ స్థానాలు కాంగ్రెస్కి ఇస్తేనే ప్రత్యేక హోదా సాధ్యం అవుతుందని తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుమార్తె కవిత, కుమారుడు కేటీఆర్, కేకే, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పదుల సార్లు చెప్పారని, కానీ ఇప్పుడు ఇద్దరు చంద్రులు యూటర్న్ తీసుకున్నారని విమర్శించారు.