అమరావతి, జూలై 20 : ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు అక్టోబరు నుంచి నిరుద్యోగ భృతిని అందజేయాలని టీడీపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆగస్టు నుంచి నిరుద్యోగులు తమన పేర్లను నమోదు చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక మొబైల్ యాప్, వెబ్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఏపీ ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. నిరుద్యోగ భృతిపై సంబంధిత అధికారులతో మంత్రి లోకేశ్ గురువారం సమీక్షించారు. ఇందుకు సంబంధించి యాప్, పోర్టల్ రూపొందించే బాధ్యతను ఈ-ప్రగతి విభాగానికి, డేటాను అందించే బాధ్యతను ఆర్టీజీఎస్కు అప్పగించారు. జులై 24 న నాటికి యాప్, పోర్టల్ను సిద్ధం చేసి అదే రోజు పరిశీలించాలని నిర్ణయించారు. ఆయా సంస్థల సమాచారాన్ని పరిశ్రమల శాఖ సేకరించి, నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా వెసులుబాటు కల్పించేందుకు కార్యాచరణను సిద్ధం చేయాలని ఆయన స్పష్టం చేశారు.