అవిశ్వాసానికి అనుమతి ఇచ్చిన స్పీకర్..

SMTV Desk 2018-07-18 13:17:41  #parliament monsoon session, no confidence motion, sumithra mahajan, loksabha

ఢిల్లీ, జూలై 18 : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడీవేడీగా ఆరంభమయ్యాయి. లోక్‌సభ ప్రారంభంకాగానే.. అవిశ్వాసంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో సభలో గందరగోళం చెలరేగింది. ఉదయం సభ ప్రారంభంకాగానే కొత్తగా ఎన్నికైన సభ్యులతో స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించి.. ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ ప్రశ్నోత్తరాలను టీడీపీ ఎంపీలు అడ్డుకున్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు పట్టుపట్టారు. సభకు సహకరించాలని స్పీకర్ పదే పదే కోరినా ఎంపీలు వెనక్కు తగ్గలేదు. స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి ప్లకార్డులను ప్రదర్శించారు. ఏపీకి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ప్రశ్నోత్తరాల తర్వాత నిర్ణయిద్దామని చెప్పినా ఎంపీలు వినిపించుకోలేదు. దీంతో ఎంపీల ఆందోళన మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. ప్రశ్నోత్తరాలు ముగిశాక ఎంపీలు మళ్లీ అవిశ్వాసంపై చర్చించాలని పట్టుబట్టగా.. కాంగ్రెస్ కూడా మద్దతు పలికింది. వెంటనే అవిశ్వాంపై చర్చ ప్రారంభించాలని కోరింది. దీనిపై స్పందించిన స్పీకర్ సుమిత్రా మహాజన్.. అవిశ్వాసానికి సంబంధించిన నోటీసు అందిందని ప్రకటించారు. అయితే చర్చ ఎప్పుడు చేపట్టాలనేది పదిరోజుల్లో నిర్ణయిస్తామని తెలపగా.. కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే అవిశ్వాసంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ చర్చకు పట్టుబట్టడంతో పార్లమెంట్ వ్యవహారాలశాఖ మంత్రి అనంత్‌కుమార్ స్పందించారు. విపక్షాల ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఇటు రాజ్యసభలోనూ టీడీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. ఏపీకి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఏపీకి జరిగిన అన్యాయంపై సభలో చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. సభకు సహకరించాలని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య పదే, పదే కోరినా సభ్యులు వినలేదు. దీంతో సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. అనంతరం సభ ప్రారంభంకాగానే.. మళ్లీ ఎంపీలు నిరసన తెలిపారు.