హైదరాబాద్, జూలై 15 : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్ నరసింహన్తో భేటి అయ్యారు. ఆదివారం మధ్యాహ్నం రాజ్భవన్కు వెళ్లిన ముఖ్యమంత్రి గవర్నర్తో సమావేశమయ్యారు. త్వరలో నాలుగో విడత హరితహారం, బీసీ స్వయం ఉపాధి పథకాలను ప్రారంభించనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యమంత్రి గవర్నర్కు వివరించినట్లు తెలుస్తోంది. బీసీ పథకాలతో పాటు సంచార జాతులను బీసీ జాబితాలో చేర్పు ప్రతిపాదనలను కూడా చెప్పినట్లు తెలిసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ విధానాలు మార్చుకోవాలని అధికారులకు సూచించిన కేసీఆర్.. ఇందుకు సంబంధించి తన అభిప్రాయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో పాటు ఇతర అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. శాసనసభ్యత్వాల రద్దు విషయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్కుమార్లు హైకోర్టులో ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన అంశం, 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల అంశం కూడా వీరి భేటీలో ప్రస్తావనకు తెచ్చినట్లు తెలుస్తోంది.