నల్గొండ, జూలై 15 : టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీని తరిమికొట్టడానికి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. ఆదివారం నల్గొండలో జరిగిన పార్లమెంటరీ స్థాయి సమీక్ష సమావేశంలో ఉత్తమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. నల్గొండ పార్లమెంట్ స్థానాన్ని దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలుస్తామన్నారు. దేశంలోనే అత్యధిక ఆధిక్యంతో నల్గొండ పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకుంటామని ఉత్తమ్ భరోసా వ్యక్తం చేశారు. శక్తి యాప్ ద్వారా బూత్ లెవల్ నుంచే పార్టీని పటిష్టం చేస్తామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధమేనని, తనకు ఎలాంటి పదవులపైనా ఆశల్లేవని ఉత్తమ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సలీం అహ్మద్, జానా రెడ్డి, కోమటి రెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ పద్మావతి, దామోదర్ రెడ్డి, మల్లు రవి, బూడిద బిక్షమయ్య గౌడ్లు పాల్గొన్నారు.