చెన్నై, జూలై 16 : బాహుబలి చిత్రంలో కట్టప్పగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సత్యరాజ్ కుమార్తె దివ్యను విదేశీయులు బెదిరించారని సమాచారం. న్యూట్రీషనిస్ట్గా పనిచేస్తున్న దివ్య అమెరికాకు చెందిన ఓ ఫార్మాస్యూటికల్ సంస్థ తయారుచేసిన విటమిన్ టాబ్లెట్లో ఓవర్డోస్ ఉన్నట్లు గుర్తించారు. ఈ టాబ్లెట్స్ ను రోగులకు ఇవ్వడానికి ఆమె తిరస్కరించారు. దీంతో ఆ విదేశీ సంస్థ తరఫున కొందరు తనకు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించగా ఆమె తిరస్కరించడంతో చంపుతామని బెదిరించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. కాగా దివ్య ఈ వ్యవహారంపై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తూ ఒక లేఖ రాశారు. "కొన్ని రోజుల క్రితం నా క్లినిక్ కి ముగ్గురు వ్యక్తులు వచ్చి మల్టీవిటమిన్, కొవ్వు టాబ్లెట్స్ గురించి ప్రస్తావించారు. శాస్త్రీయ కాలపరిమితి లేకుండా మందులు రాసివ్వనని చెప్పడంతో, మాకు మీ రాజకీయవేత్తలతో సంబంధం ఉందంటూ నన్ను బెదిరించారు". అందుకే ప్రధానికి ఫిర్యాదు చేశానని దివ్య తెలిపారు.