లండన్, జూలై 15 : టీ-20 సిరీస్లో రెండో టీ-20లో లాగే ద్వితీయ విఘ్నంను కోహ్లిసేన దాటలేకపోయింది. అద్భుత బ్యాటింగ్ తో వన్డే సిరీస్ ఆరంభించిన టీమిండియా రెండో మ్యాచ్లో తడబడింది. సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్ రూట్ శతకంతో ఘనవిజయం సాధించింది. దీంతో సిరీస్ ను 1-1తో సమం చేసింది. తొలుత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 322 పరుగులు చేసింది. జో రూట్ (116 బంతుల్లో 113; 8 ఫోర్లు, 1 సిక్స్) మోర్గాన్ (51 బంతుల్లో 53; 4 ఫోర్లు, 1 సిక్స్), విల్లే (31 బంతుల్లో 50 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. కుల్దీప్ 3 వికెట్లు తీశాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన భారత్ సరిగ్గా 50 ఓవర్లలో 236 పరుగులే చేసి ఆలౌటైంది. నిజానికి ఓపెనర్లు ధావన్ (36; 30 బంతుల్లో 6×4), రోహిత్ ఇన్నింగ్స్ను సాఫీగానే ఆరంభించారు. అయితే వరుస విరామాల్లో భారత్ వికెట్లను కోల్పోయింది. టీమిండియా జట్టులో కోహ్లి (56 బంతుల్లో 45; 2 ఫోర్లు), రైనా (63 బంతుల్లో 46; 1 ఫోర్) పరువు నిలిచే స్కోరు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో ప్లంకెట్కు 4 వికెట్లు దక్కాయి. రూట్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. చివరి నిర్ణయాత్మక వన్డే 17న లీడ్స్లో జరగనుంది.