అమరావతి, జూలై 14 : ఎన్డీయే నుంచి వైదొలిగే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తొందరపాటుగా వ్యవహరించారని.. కొనసాగి ఉంటే హోదాపై ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించేవారని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే అన్నారు. అంతేకాకుండా జగన్ను తాము ఎన్డీయేలోకి ఆహ్వానిస్తున్నామని, తమతో కలిస్తే ఆయన సీఎం అయ్యేందుకు సహకరిస్తామని వెల్లడించారు. హైదరాబాద్ పర్యటన సందర్భంగా అథవాలే ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రాహుల్పై వ్యంగ్యస్త్రాలు సంధించారు. రాజ్యాంగాన్ని తానూ, మోదీ రక్షిస్తామని.. కాంగ్రెస్ పార్టీని ఆయన రక్షించుకోవాలని సలహా ఇచ్చారు. ఇప్పటికే బీజేపీ నుండి బయటకు వచ్చిన టీడీపీ పార్టీ నేతలు.. వైసీపీ నేత జగన్ మోదీను విమర్శించడం లేదని..ఆ పార్టీతో లోపాయకారీ ఒప్పందం చేసుకున్నారని అంటున్నారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలకు అధికార పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.