హైదరాబాద్, జూలై 14 : టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించిన షికాగో సెక్స్ రాకెట్లో అమెరికా న్యాయస్థానం నిందితులైన కిషన్ మోదుగుమూడి, ఆయన భార్య చంద్రలను దోషులుగా తేల్చింది. ఈవెంట్ల పేరుతో హీరోయిన్లను అమెరికా రప్పించి.. అక్కడ వారితో వ్యభిచారం చేయించారన్న ఆరోపణలు నిజమేనని అమెరికా న్యాయస్థానం తేల్చింది. జూలై 18న వీరికి శిక్ష వేయనుంది. వీరికి పదేళ్ల వరకూ శిక్ష పడే అవకాశం ఉందని సమాచారం. అనైతిక కార్యక్రమాల కోసం విదేశీ మహిళలను అక్రమంగా రవాణా చేసినట్టు పేర్కొంది. వీసా పర్మిట్లను దురిన్వియోగం చేశారన్న ఫెడరల్ ఏజెన్సీ ఆరోపణలతో నార్త్ ఎలినాయ్ కోర్టు ఏకీభవించింది. తెలుగు సినిమాలకు కో ప్రొడ్యూసర్గా పని చేసిన కిషన్.. తర్వాత అమెరికాలో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. తనకున్న పరిచయాలతో నటీమణులను సెక్స్ రాకెట్లోకి లాగాడు. కొన్ని ఏళ్లపాటు తన భార్యతో కలిసి ఈ దందాను నడిపాడు. అమెరికాలోని తెలుగు సంఘాలకు ఈవెంట్ల కోసం సెలబ్రిటీలను సప్లయ్ చేసే కోఆర్డినేటర్ ముసుగులో నటీమణులను వ్యభిచార ఊబిలోకి లాగారు. కిషన్ మోదుగుమూడి విటులతో మాట్లాడుతున్న ఆడియో టేపులు ఆ మధ్య బయటకు వచ్చాయి.