ఢిల్లీకు వెళ్లిన కిరణ్‌కుమార్‌రెడ్డి ..

SMTV Desk 2018-07-12 16:30:24  nallari kiran kumar reddy, rahul gandhi, congress, ap congress, delhi

ఢిల్లీ, జూలై 12 : ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో ఆయన సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నకిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో తిరిగి చేరనున్నారని కొద్దిరోజులుగా వార్తలు వచ్చాయి. ఇటీవల పలువురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు కిరణ్‌ కుమార్‌రెడ్డిని కలిశారు. ఈ నేపథ్యంలో కిరణ్‌ కుమార్‌రెడ్డి, రాహుల్‌ గాంధీ భేటీ కానుండటంతో కాంగ్రెస్‌లో ఆయన పునః ప్రవేశం ఇక లాంఛనమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ పూర్తిగా పట్టుకోల్పోయింది. ఈ క్రమంలోనే విభజన తర్వాత పార్టీని వీడిన నేతలను తిరిగి చేర్చుకుని రాష్ట్రంలో తిరిగి పట్టు సాధించాలని కాంగ్రెస్‌ పార్టీ యోచిస్తోంది. ఈ వ్యూహంలో భాగంగానే కిరణ్‌కుమార్‌ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించాలని అధిష్ఠానం నిర్ణయించినట్లు సమాచారం. ఏపీ ప్రజలు ఆ పార్టీని ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ స్థానంలో కూడా గెలిపించలేదు. అయితే ఇటీవల కాలంలో రాష్ట్రంలో రాజకీయ వేడి పెరిగింది. ప్రత్యేక హోదా సహా విభజన హామీలు నెరవేర్చడంలో బీజేపీ నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపిస్తూ అధికార తెలుగుదేశం పార్టీ ఎన్డీయే కూటమి నుంచి వైదొలగింది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదా దస్త్రం మీదే చేస్తామని రాహుల్‌ గాంధీ ప్రకటించారు. ఇదే విషయాన్ని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు సభలు, సమావేశాల్లో చెబుతూ ప్రజల్లో బలంగా నాటుకునేలా ప్రయత్నం చేస్తున్నారు.