మాస్కో, జూలై 12 : ఫిఫా -2018లో మరో సంచలనం నమోదైంది. క్రొయేషియా తొలిసారి ఫైనల్లోకి ప్రవేశించి చరిత్ర లిఖించింది. లుజ్నికీ స్టేడియంలో జరిగిన హోరాహోరి పోరులో ఇంగ్లాండ్పై 2-1 తేడాతో విజయం సాధించింది. ఇక ఆదివారం జరిగే టైటిల్ పోరులో ఫ్రాన్స్తో అమీతుమీ తేల్చుకోనుంది. 1966 తర్వాత రెండో సారి ఫైనల్ చేరాలన్న ఇంగ్లాండ్ ఆశలను క్రొయేషియా ఆవిరి చేసింది. ఆట 5వనిమిషంలో ఇంగ్లండ్ ఆటగాడు ట్రిపియర్ గోల్ చేయగా.. తొలి అర్ధభాగం ముగిసేసరికి ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ప్రథమార్థంలో ఒక్కగోలే నమోదైనప్పటికీ ద్వితీయార్థంలో క్రొయేషియా ఆటగాడు ఇవాన్ పెరిసిక్ 68వ నిమిషంలో గోల్ కొట్టి జట్టు స్కొరును సమం చేశాడు. మ్యాచ్ అదనపు సమయంలో క్రొయేషియా.. ఇంగ్లండ్ కు షాకిచ్చింది. మారియో మండ్జుకిక్ 109 నిమిషంలో గోల్ చేసి క్రొయేషియాను విజయ తీరాలకు చేర్చాడు.