అన్న క్యాంటీన్లు ప్రారంభం.. రూ.5 కే భోజనం..

SMTV Desk 2018-07-11 13:35:47  Anna Canteens inauguration, chandrababu naidu, anna canteens, amarvathi

విజయవాడ, జూలై 11 : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పేదలకు తక్కువ ధరలకే భోజనాన్ని అందించాలన్న లక్ష్యంతో అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. మొదటి విడతగా గురువారం 60 క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. రూ.5లకు అల్పాహారం, భోజనం అందించే అన్న క్యాంటీన్‌ను విజయవాడలోని భవానీపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా 203 క్యాంటీన్ల అందుబాటులోకి తీసుకురానున్నారు. మూడుపూటలా కలిపి రూ.73లు ఖర్చయ్యే ఆహారాన్ని ప్రభుత్వం రూ.15కే అందిస్తోంది. క్యాటరింగ్‌ బాధ్యతలను అక్షయపాత్ర సంస్థకు అప్పగించారు. రోజు రెండు లక్షల మందికి ఆహారం అందజేయడమే లక్ష్యంగా ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసింది. ప్రతి క్యాంటీన్‌లో రోజుకు 250-300 మందికి ఆహారం అందేలా ఏర్పాట్లు చేశారు. అవసరాన్ని బట్టి మరింత ఎక్కువ మందికి ఆహారాన్ని అందించేలా చర్యలు తీసుకొనున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో క్యాంటీన్ల నిర్వహణ, పర్యవేక్షణ చేస్తారు. భవానీపురంలో అన్న క్యాంటీన్‌ ప్రారంభించిన ముఖ్యమంత్రి అక్కడి ఆహారాన్ని మహిళలతో కలిసి భోజనం చేశారు.