పాకిస్థాన్, జూలై 10 : పొరుగు దేశమైన పాకిస్థాన్ లో జూలై 25న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, ఎన్నికల ప్రచార సమయంలో పలువురు నేతలపై ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందని పాకిస్థాన్ కు చెందిన జాతీయ కౌంటర్ టెర్రరిజం అథారిటీ హెచ్చరించింది. టెర్రరిస్టులు హిట్ లిస్టులో తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్, అవామీ నేషనల్ పార్టీ అధ్యక్షుడు అఫ్సంద్యార్ వలీ, క్వామీ వతన్ పార్టీ కి చెందిన అహ్మద్ ఖాన్ షెర్పావో, జమియత్ ఉలేమా ఇ ఇస్లాం ఫజల్ నేత అక్రమ్ దుర్రానీ, ఏఎన్పీ నేత అమీర్ హైదర్ మోటీలు ఉన్నారు. వీరితో పాటు లష్కరే తాయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కుమారుడు తల్హా సయీద్ కూడా లిస్టులో ఉండటం గమనార్హం. అల్లాహో అక్బర్ తెహ్రీక్ పార్టీ తరపును తల్హా సయీద్ ఎన్నికల బరిలోకి దిగారు. వీరితో పాటు పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీకి చెందిన నేతలు కూడా జాబితాలో ఉన్నారు.