విశాఖపట్నం, జూలై 10 : ఏపీ మానవ వనరులు శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఉత్తరాంధ్ర పర్యటనలో టీడీపీపై పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఉత్తరాంధ్రలో పర్యటించి.. అవాస్తవాల్ని పవన్ ప్రచారం చేశారని గంటా ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదాపై దేశం మొత్తం తిరిగి మద్దతు కూడగడతానన్న పవన్ పత్తా లేకుండా పోవటాన్నిగంటా ప్రశ్నించారు. తాను పవన్ కు పాతిక ప్రశ్నలు సంధించానని.. కానీ వాటిలో వేటికీ పవన్ సమాధానాలు చెప్పలేదన్నారు. రాష్ట్రానికి కేంద్రం చేయాల్సిన సాయం అవసరాన్ని తెలియజేస్తూ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్ట్ ఇస్తే దాని మీద పవన్ నోరు విప్పలేదన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.." రైల్వేజోన్, ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ ఇలా ప్రతి అంశంలోనూ తెలుగుదేశాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుంటున్న పవన్... మోదీ, అమిత్ షాను ప్రశ్నించడానికి మాత్రం సాహసం చేయలేకపోతున్నారు. బీజేపీ మాటలనే పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నట్లు ఉంది. వివిధ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం పంపిన దస్త్రాలు కేంద్రం వద్దే పెండింగ్లో ఉన్నాయని.. వీటి గురించి మాట్లాడే ధైర్యం పవన్కు లేదు. గత ఎన్నికల్లో టీడీపీ గెలిచేందుకు సాయం చేసిన విషయాన్నినేను ఒప్పుకుంటాను. కానీ పవన్ లేనప్పుడు కూడా టీడీపీ గెలిచిందన్న విషయాన్ని మర్చిపోకూడదు" అని గంటా వ్యాఖ్యానించారు.