ఢిల్లీ, జూలై 10 : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఘటనకు చెందిన నాలుగురు నిందితులకు సుప్రీం కోర్టు ఉరి శిక్షను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ హైకోర్టు సహా కింది కోర్టుల తీర్పును సమర్ధించిన ధర్మాసనం ఉరి శిక్ష సబబే అని తెలిపింది. ఈ కేసులో మరణ శిక్ష పడ్డ ముగ్గురు ముద్దాయిలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను న్యాయస్థానం నిరాకరించింది. ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం తీర్పుపై సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శిక్ష పడటంలో ఆలస్యమైనా సుప్రీం సరైన నిర్ణయమే తీసుకుందంటూ ట్విటర్ ద్వారా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. * ప్రియాంక చోప్రా: న్యాయం జరగడంలో కాస్త ఆలస్యమైంది. ఇలాంటి దారుణమైన అరాచకాలకు పాల్పడేవారిని చట్టం వదిలిపెట్టదని ఈ తీర్పుతో సుప్రీంకోర్టు మరోసారి తేల్చి చెప్పింది. * గౌతం గంభీర్: నిర్భయ తీర్పు విని గర్వపడటం కంటే ముందు మహిళలకు కరవైన భద్రత గురించి ఆలోచిద్దాం. మన తప్పుల నుంచి ఏమన్నా నేర్చుకున్నామా? లేదు. అన్ని చోట్లా సీసీ కెమెరాలు ఉన్నాయా? లేవు. పోలీస్ స్టేషన్లలో మహిళా పోలీసుల సంఖ్య పెరిగిందా? లేదు. బహుశా మనం మరో నిర్భయ కోసం ఎదురుచూస్తున్నట్లున్నాం. * రాజ్యవర్ధన్ రాథోడ్: అత్యాచారం క్షమించరాని నేరం. నిర్భయను దారుణంగా రేప్ చేసిన నీచులకు సరైన శిక్షే పడింది. వారి రివ్యూ పిటిషన్ను తిరస్కరించిన సుప్రీం తీర్పు అభినందనీయం. * కస్తూరి: మొత్తానికి శిక్ష ఖరారైంది. ప్రజలకు బుద్ధిచెప్పే అవకాశం ఇవ్వకుండా ఆ మృగాలు ఆరేళ్లు జైల్లో కూర్చుని ఎంజాయ్ చేశారు. వారి చావుకు సమయం ఆసన్నమైంది. నిందితుల్లో ఒకరు మైనర్ కావడంతో మరణ శిక్ష నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఈషా రెబ్బా: ఎట్టకేలకు న్యాయం జరిగినందుకు సంతోషంగా ఉంది