ముంబై, జూలై 9 : టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ప్రస్తుతం ఇండస్ట్రీలో బయోపిక్ ల పర్వం నడుస్తోంది. మూడు పాటలు, నాలుగు ఫైట్స్, కామెడీ సీన్లు కాకుండా కాస్తంత వినూత్నంగా ఆలోచిస్తూ దర్శకనిర్మాతలు ప్రముఖుల జీవిత చరిత్రలను తెరకెక్కిస్తున్నారు. ఈ మధ్యకాలంలో క్రీడాకారుల బయోపిక్లు తెరకెక్కించేందుకు దర్శకులు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖుల జీవితచరిత్రలను తెరకెక్కించారు. తాజాగా మహిళా టీమిండియా కెప్టెన్ మిథాలీ రాజ్ బయోపిక్ పట్టాలెక్కబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా మిథాలీ మీడియా ద్వారా వెల్లడించారు. వయాకామ్ 18 సంస్థ బయోపిక్ కోసం తనను సంప్రదించారని.. ఇందుకు తాను ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మిథాలీ మీడియాతో మాట్లాడుతూ.. "నాకు సినిమాల గురించి పెద్దగా తెలీదు. కానీ నా పాత్రలో ప్రియాంక చోప్రా అయితే సరిగ్గా సరిపోతారు అనుకుంటున్నా. మా ఇద్దరి వ్యక్తిత్వాలు ఒకేలా ఉంటాయి. నా బయోపిక్లో ఎవరు నటించాలి? అనే విషయాన్ని చిత్రబృందానికే వదిలేస్తున్నాను. ప్రస్తుతం సినిమా స్క్రిప్టింగ్ దశలో ఉంది. 2019లో సినిమా చిత్రీకరణ మొదలవబోతోంది. ఈలోగా నేను ఈ ఏడాది సెప్టెంబర్లో నా ఆటోబయోగ్రఫీని విడుదల చేయబోతున్నాను" అని పేర్కొన్నారు.