తిరుపతి, జూలై 9 : కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుచేయాలనీ డిమాండ్ చేస్తూ టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ ఆమరణ నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. జూన్ 20 న ప్రారంభించిన దీక్షను 11 రోజులపాటు కొనసాగించారు. సీఎం రమేశ్తో ముఖ్యమంత్రి చంద్రబాబు జూన్ 30 దీక్ష విరమింపజేయించారు. తాజాగా సీఎం రమేష్ తిరుమల శ్రీవారిని సోమవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో ఆలయానికి చేరుకుని స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో రమేశ్కు ఆలయ పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను ఆయనకు అందజేశారు. స్వామివారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం రమేశ్.. " కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం తలపెట్టిన దీక్షను కొనసాగిస్తున్నాను. దీక్ష చేపట్టిన నాటి నుంచి ఎలాంటి ఆహారం తీసుకోలేదని, కేవలం ద్రవ పదార్థాలను మాత్రమే తీసుకుంటున్నాను. ఇక స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి పునాది వేసే వరకు గడ్డం తీయబోనని శ్రీవారికి మొక్కుకున్నాను. అంతవరకు గడ్డం తీయబోను" అని ఆయన వ్యాఖ్యానించారు.