హైదరాబాద్, జూలై 8 : దేశవ్యాప్తంగా లోక్సభకు, అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికల నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. జమిలి ప్రతిపాదనపై లా కమిషన్ శనివారం వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపిన విషయం తెలిసిందే. ఈ విషయంపై దేశంలోని రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాన్ని తెలపాలని లా కమిషన్ ఇటీవల ప్రకటన కూడా చేసింది. నిన్న, నేడు పలు రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాన్ని లా కమిషన్కు తెలిపాయి. ఈ మేరకు టీఆర్ఎస్ పార్టీ జమిలి ఎన్నికలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ లా కమిషన్కు లేఖ రాశారు. ఈ విషయంపై టాజాగా టీఆర్ఎస్ ఎంపీ వినోద్ మీడియాతో మాట్లాడుతూ... "2019 నుంచి జమిలి ఎన్నికలకు టీఆర్ఎస్ అనుకూలం. జమిలి ఎన్నికలంటే అన్ని రాష్ర్టాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం. జమిలి ఎన్నికలపై చర్చ ఇప్పటికిప్పుడే మొదలైంది కాదు. జమిలి ఎన్నికలపై 1983 నుంచి జాతీయ న్యాయ కమిషన్ చర్చిస్తోంది. మోదీ ప్రభుత్వమో, బీజేపీ ఈ చర్చను ప్రారంభించలేదు. జమిలి ఎన్నికలంటే ప్రధాని నరేంద్రమోదీ తెచ్చిన కొత్త విధానం అనుకుంటున్నారు. మోదీ కంటే ముందు నుంచే ఈ అంశంపై చర్చ జరుగుతోంది" అంటూ పేర్కొన్నారు.