అమరావతి, జూలై 7 : ప్రపంచ నగరాల సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూడు రోజుల సింగపూర్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుంచి చెన్నై వెళ్లిన సీఎం.. అక్కడి నుంచి సింగపూర్ చేరుకుంటారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు, సీఆర్డీఏ, ఏడీసీ, ఈడీబీకి చెందిన అధికారులు ఉంటారు. మూడు రోజుల పర్యటలనో చంద్రబాబు ప్రధానంగా సింగపూర్లో జరిగే ప్రపంచ నగరాల సదస్సుల్లో పాల్గొని.. కీలక ప్రసంగాలు చేస్తారు. అలాగే అమరావతి నిర్మాణంతో పాటూ.. పెట్టబడులపై దృష్టి పెడుతున్నారు. సింగపూర్ పర్యటనలో భాగంగా సీఎం పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశంకానున్నారు. సింగపూర్ సదస్సులో భాగంగా.. సీఆర్డీఏ అమరావతి పెవిలియన్ పేరుతో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. రాజధానిలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు వివరిస్తూ.. అక్కడ ఏర్పాటయ్యే ప్రాజెక్టులు, సంస్థల భాగస్వామ్యాన్ని తెలియజేసేలా ప్లాన్ చేశారు. పర్యటనలో పలువురు సింగపూర్ మంత్రులతోనూ చంద్రబాబు భేటీ అవుతారు. అలాగే లీ క్వాన్ యూ ఇనిస్టిట్యూట్లో జరిగే అవార్డుల ప్రదానోత్సవంకు హాజరవుతారు. ఈ నెల 10న సింగపూర్ నుంచి బయల్దేరతారు.