జమ్ము కశ్మీర్, జూలై 7 : జమ్ము కశ్మీర్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శనివారం కుల్గామ్ జిల్లాలోని హవూరా గ్రామంలో అల్లరిమూక రాళ్లదాడితో చెలరేగిపొగా.. వారిని నియంత్రణ చేసే క్రమంలో భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో ఓ బాలికతో పాటు ఇద్దరు యువకులు ప్రాణాలు విడిచారు. మరో పది మందికి గాయాలైనట్లు సమాచారం. శనివారం ఉదయం కార్డన్ సెర్చ్ చేపట్టిన భద్రతా బలగాలను అడ్డుకునే క్రమంలో అల్లరిమూక రాళ్లదాడికి పాల్పడింది. దీంతో బలగాలు కాల్పులు చేయడంతో షకీర్ అహ్మద్(22), ఇర్షద్ మాజిద్(20), అంద్లీబ్(16) ప్రాణాలు కోల్పోయారు. ఇక ఘటన తర్వాత పుకార్లు చెలరేగకుండా ఉండేందుకు అంతర్జాల సేవలను నిలిపివేశారు. ఖుల్గాం, అనంతనాగ్, సోఫియాన్, పుల్వామా జిల్లాల్లో బలగాలను భారీ ఎత్తున్న మోహరించి పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు.