ఢిల్లీ, జూలై 7 : ప్రస్తుతం సాంకేతికతతో కొందరు అక్రమార్కులు ప్రజల డేటాను తస్కరిస్తున్నారు. ఎప్పటి నుండో దేశంలో వ్యక్తిగత సమాచార గోప్యతపై అనుమానాలు నెలకొన్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సిమ్ కార్డుల జారీ కోసం నకిలీ వేలి ముద్రలతో ఆధార్ను పక్కదారి పట్టించిన కేసు వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది. అందుకోసం ఆధార్ దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసే దిశలో కేంద్రం ముందుకు వెళ్తోంది. ఆయా అవసరాలకు తగినట్లుగా ఆధార్ నంబరు సేకరించినా దానిని బహిర్గతం చేసే విషయంలో స్వేచ్ఛను ఆయా రాష్ట్రాలకే విడిచి పెట్టింది. మోసగాళ్లకు అవకాశం లేకుండా చివరి నాలుగు అంకెలు ప్రదర్శించాల్సిన అంశాలపై రాష్ట్రాలు ఆలోచన చేయాలని కేంద్రం విజ్ఞప్తి చేసింది.