హైదరాబాద్, జూలై 6 : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ కి మరో వ్యక్తితో నిన్న నిశ్చితార్థ౦ జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులు, పలువురు నెటిజన్లు ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు. దీంతో వారి టార్చర్ భరించలేక ఆమె ట్విట్టర్ నుండి బయపకు వచ్చేశారు. ఇక తనను ఇన్ స్టా గ్రామ్ లో కూడా ప్రశాంతంగా ఉండనివ్వడం లేదంటూ రేణు తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. పవన్ కల్యాణ్ ను కించపరుస్తూ సోషల్ మీడియలో వస్తున్న ఓ ఫొటోపై రేణు స్పందించాలని పలువురు ఆమెను కోరుతున్నారట. ఈ విషయానికి రేణు చాలా ఘాటుగానే స్పందించారు. ఈ మేరకు తన ఫేస్ బుక్ లో "గత ఐదేళ్లుగా తనను కొందరు ఇలాగే ట్రోల్ చేస్తున్నపుడు నన్ను సైలెంట్ గా ఉండాలని సలహా ఇచ్చిన వారే.. ఇపుడు స్పందించాలని కోరుతున్నారు. తాను పబ్లిసిటీ కోసం పోస్టులు పెడుతున్నానని కొందరు దూషించారు. ఇప్పుడేమో ఓ నీచుడు పవన్ ఫోటోలను సోషల్మీడియాలో పెడుతూ నెగిటివ్ కామెంట్లు చేస్తున్నాడు. దానిని ఖండించమని నన్ను అడుగుతున్నారు. కొందరేమో పవన్ కల్యాణ్ను సపోర్ట్ చేయాలని మర్యాదపూర్వకంగా అడుగుతుంటే మరికొందరు బెదిరిస్తున్నారు. ఆయనకొక రూల్, నాకొక రూలా? గత ఐదేళ్లుగా కొందరు నన్ను నోటికొచ్చినట్లు తిడుతున్నప్పుడు నా ఆత్మాభిమానం మీకు ముఖ్యం అనిపించలేదా? పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న ఈ సమాజంలో ఉంటున్నందుకు చాలా బాధగా ఉంది. ఏదో ఒక రోజు నాకంటూ మనశ్శాంతి దొరుకుతుందని ఆశిస్తున్నా. అందరికి ఒక విషయం నేనెప్పుడూ పవన్ గురించి తప్పుగా మాట్లాడను. అలా మాట్లాడమని నన్ను కానీ నా పిల్లలను కానీ ఏ రాజకీయ పార్టీ ప్రేరేపించలేదు" అంటూ ఘాటుగా స్పందించారు.