కర్నూలులో ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్య..

SMTV Desk 2018-07-06 13:29:54  kurnool medical student suicide, mbbs student suicide, kurnool medical college, harshpraneeth reddy

కర్నూలు, జూలై 6 : కర్నూలు మెడికల్ కాలేజీలో ఓ వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న హర్షప్రణీత్ రెడ్డి కాలేజీ హాస్టల్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. చదువులో ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడని ప్రణీత్ తోటి విద్యార్థులు చెపుతున్నారు. అయితే ఈ హత్యపై ప్రణీత్ తండ్రి రామంజులు రెడ్డి కాలేజ్ ప్రిన్సిపాల్‌తో వాగ్వాదానికి దిగారు. మెడికల్‌ కాలేజీలో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్‌ చదువుతున్నాడు. గురువారం రాత్రి 11.30 నిమిషాలకు తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకొన్నాడు. అయితే కొద్ది సేపటికి సహచర విద్యార్ధులు వచ్చి డోర్‌ కొట్టగా హర్ష స్పందించక పోవడంతో అనుమానం వచ్చి బద్దలు కొట్టారు. చలనం లేకుండా పడివున్న మిత్రుడిని హాస్పిటల్‌కు తరలించి కళాశాల యాజమాన్యానికి, పోలీసులకు సమాచారం అందించారు. అయితే అప్పటికే హర్ష మరణించినట్లు వైద్యులు తెలిపారు. నా కుమారుడు పిరికివాడు కాదు.. కొట్టి చంపారని తండ్రి ఆరోపిస్తున్నారు. "గతంలో ర్యాగింగ్ చేసి వేదిస్తున్నారని హర్ష చెప్పాడు. కాలేజీలో ఇవి మామూలే పట్టించుకోకుండా బాగా చదువుకొమ్మని నచ్చచెప్పాను"అని రామాంజులు రెడ్డి తెలిపారు. హర్ష మృతిపై కాలేజీ యాజమాన్యం, హాస్టల్ యాజమాన్యం సమాచారం ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.