అమరావతి, జూలై 6 : ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం చేదు వార్త అందించింది. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల వాయిదా వేస్తున్నట్లు.. మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలను శుక్రవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రానునందున ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఆర్థిక శాఖ కొన్ని కొర్రీలు పెట్టింది. మరిన్ని వివరాలు కావాలని అడిగింది. వాటికి సమాధానం ఇచ్చాం. త్వరలో అనుమతి రావొచ్చు. బీఎడ్ అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టుల్లో కూడా ప్రాధాన్యం కల్పిస్తూ ఎన్సీటీఈ విడుదల చేసిన గెజిట్పై కూడా చర్చిస్తున్నామని గంటా వెల్లడించారు. ఇంతకు ముందు ప్రభుత్వం జులై 6న 10,351 టీచర్ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించింది. టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకుగాను పాఠశాల విద్యాశాఖ నుంచి పంపిన ప్రతిపాదనలకు ఆర్థికశాఖ ఆమోదముద్ర వేయకపోవడంతో నోటిఫికేషన్ వాయిదా వేయాల్సి వచ్చింది.