ఆ గృహాన్ని ఆలయంగా మార్చండి..!

SMTV Desk 2018-07-06 11:34:14  delh 11 members family suicide, delhi suicide incident, Bhatia family suicide, delhi

ఢిల్లీ, జూలై 6 : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీలోని బురారీ కుటుంబం ఆత్మహత్య దర్యాప్తు చేసే కొద్దీ విస్తుగొలిపే విషయాలు వెలుగుచూస్తున్నాయి. చనిపోడానికి కొద్ది గంటల ముందు ఆ కుటుంబంలోని కొందరు వ్యక్తులు ఆత్మహత్యల కోసం స్టూలు, వైర్లు తీసుకుని వెళ్తున్నట్లుగా ఓ వీడియోలో పోలీసులకు లభించింది. ఇదిలా ఉంటే.. ఆ 11 మంది ఆత్మహత్య చేసుకున్న ఇంటిని ఏం చేయనున్నారు..? అనేది తాజాగా చాలామందికి ఎదురవుతున్న ప్రశ్న. అయితే ఆ ఇంటిని ఆలయంగా మార్చాలని కొందరు స్థానికులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారట. ఢిల్లీలోని బురారీ ప్రాంతానికి చెందిన నారాయణ్‌ దేవి కుటుంబం గత శనివారం అర్ధరాత్రి సామూహిక ఆత్మహత్యలకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఆదివారం ఈ విషయం వెలుగులోకి రాగా.. అప్పటి నుంచి పోలీసుల విచారణ కొనసాగుతోంది. కాగా.. కుటుంబంలోని 11 మంది ఒకేసారి ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. దీనికి తోడు ఆత్మహత్య వెనుక కారణాలు మీడియాలో ప్రసారం కావడం, పోలీసులు రోజూ ఆ ఇంటి వద్దకు వచ్చి వెళ్తుండటంతో వారంతా ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే ఆ ఇంటి చుట్టుపక్కల నివసించే చాలా మంది భయంతో తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్తున్నారట. కాగా.. ప్రస్తుతం నారాయణ్‌ దేవి ఇంటిని పోలీసులు సీజ్‌ చేశారు. మరి దర్యాప్తు తర్వాత ఆ ఇంటిని ఎవరికి అప్పగిస్తారు అన్న దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. అయితే ఆ ఇంటిని ఆలయంగా మార్చితేనే మంచిదని కొందరు స్థానికులు అభిప్రాయం పడుతున్నారు.