హైదరాబాద్, జూలై 5 : తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తార త్రిష. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నా.. పార్టీలు, పబ్లు అంటూ జీవితాన్ని బాగానే ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం కెనడాలో విహరిస్తున్న ఈ అమ్మడుకి కాస్త దైర్యం ఎక్కువనే చెప్పాలి. ఎవరికైనా సాధారణంగా 20 అడుగులపై నుంచి కిందికి చూస్తేనే కళ్లు తిరుగుతాయి. అలాంటిది ఏకంగా 1,168 అడుగుల ఎత్తైన బిల్డింగ్ అంచున రోప్ సాయంతో 10 నిమిషాలు నిలబడి ఆ దృశ్యాలను ఫొటో తీసుకుని వాటిని తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది త్రిష. ఈ ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. "1168 అడుగుల దిగువన జరుగుతున్న బేస్బాల్ మ్యాచ్ను 10 నిమిషాలపాటు చూడడం చాలా గొప్ప అనుభూతి" అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఆ ఫొటోలిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయి అభిమానుల్ని విపరీతంగా అలరిస్తున్నాయి. త్రిష ధైర్య, సాహసాల గురించి వారు ఒక రేంజ్లో పొగిడేస్తున్నారు.