ఎస్.కోట, జూలై 2 : నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అవసరం లేదని ఉద్యోగాలు కావాలని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఐదేళ్లు పాలించే అవకాశం జనసేనకు ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు. విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఎస్.కోటలోని దేవి గుడి జంక్షన్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఉత్తరాంధ్రను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. " నిరుద్యోగంతో ఉత్తరాంధ్ర కొట్టుమిట్టాడుతోంది. బాబు వస్తే జాబు వస్తుందన్నారు.. కానీ తనకొడుక్కి మాత్రమే జాబ్ వచ్చింది. ఉత్తరాంధ్ర ప్రజలకు టీడీపీ పట్టించుకోవడం లేదు. తెలంగాణలో స్థిరపడ్డ ఉత్తరాంధ్రకు చెందిన వెనుకబడిన 23 కులాలు బీసీ జాబితాలోకి రావడం లేదు" అని వ్యాఖ్యానించారు. కొన్ని రోజుల క్రితం వరకు ఉత్తరాంధ్రలో జనసేన పోరాట యాత్ర సాగగా.. రంజాన్ పర్వదినం నేపథ్యంలో విరామం ప్రకటించిన పవన్ ఈ రోజు నుంచి మళ్లీ తన యాత్రను ప్రారంభించారు.