ముంబై, జూలై 2 : "అర్జున్ రెడ్డి" సినిమా ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. సందీప్ వంగ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యువ హీరో విజయ్ దేవరకొండ, శాలినీ పాండే జంటగా నటించారు. అయితే ఈ చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. షాహిద్ కపూర్-తార సుటారియా జంటగా నటిస్తున్నారు. దర్శకుడు సందీప్ వంగ ఈ ప్రాజెక్టును తెరకెక్కించబోతున్నాడు. త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతోంది. అయితే ఈ చిత్రం కోసం తొలుత జాన్వీ కపూర్ పేరును పరిశీలించారన్న వార్త ఒకటి ఇప్పుడు హల్చల్ చేస్తోంది. కాని ప్రముఖ దర్శక-నిర్మాత, ఆమె మెంటర్ అయిన కరణ్ జోహర్ అందుకు ఒప్పుకోలేదట. ఎందుకంటే కెరీర్ ప్రారంభంలోనే ఇలాంటి బోల్డ్ సినిమాలు చేయడం మంచిది కాదని జాన్వీకి సూచించాడంట. దీంతో జాన్వీ ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుందట. ఇలా జాన్వీ క్రేజీ ఆఫర్ ను వదిలేసుకుంది. ఇదిలా ఉండగా.. జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ జంటగా నటించిన "ధడక్" చిత్రం ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.