కడప, జూన్ 30 : కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న టీడీపీ ఎంపీ రమేష్ దీక్షను విరమించారు. గత 11 రోజులుగా ఆయన చేస్తున్న దీక్షను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిమ్మరసం ఇచ్చి సీఎం రమేశ్, ఎమ్మెల్సీ బీటెక్ రవిల దీక్షలను విరమింప జేశారు. అంతకుముందు వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంద్రబాబు ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.."5 కోట్ల ఏపీ ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నా. రెండు నెలల్లోపు ఉక్కు పరిశ్రమపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలి. కేంద్రం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే సగం ఖర్చు భరిస్తాం. ప్రాణం పోయినా ఫర్వాలేదని దీక్ష చేస్తున్న రమేశ్కు అభినందనలు. ఆరోగ్యం బాగాలేకున్నా ఏడు రోజులు బీటెక్ రవి దీక్ష చేశారు. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి చాలా వరకు దెబ్బతినే పరిస్థితి వచ్చింది. పవిత్రమైన భావం, చిత్తశుద్ధితో రమేశ్ దీక్ష చేస్తున్నారు. దీక్షలపై ప్రతిపక్ష నేతలు అనవసర విమర్శలు మానుకోవాలి. కేంద్రం ముందుకు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనా ఓ కమిటీ వేస్తాం. కేంద్రంతో మాట్లాడతాం. పార్లమెంట్లో పోరాడతాం" అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.