జైపూర్, జూన్ 30 : సాధారణంగా ప్రజాప్రతినిధులు శాసనసభలో మాటల యుద్ధానికి దిగడం, ఇంకా చర్చ వాడివేడిగా సాగితే పరస్పరం దూషణలు చేసుకోవడం సహజమే. ఈ మధ్య కాలంలో ఒకరిపై ఒకరు పేపర్లు విసురుకోవడం, చేయి చేసుకోవడం లాంటి వార్తలు కూడా వింటున్నాం. తాజాగా రాజస్థాన్లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. అయితే అది అసెంబ్లీ సమావేశంలో కాదు. మంత్రి ఇంట్లోనే మరో మంత్రి వచ్చి ఆయనపై చేయిచేసుకున్నారు. అసలు విషయమేమిటంటే.. శిఖర్ జిల్లా ఖండేలా నియోజకవర్గంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు సక్రమంగా జరగట్లేదని ఆరోపణలు రావడంతో ఆ నియోకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి బన్షీధర్ బజియా ఆగ్రహానికి లోనయ్యారు . ఈ విషయమై విద్యాశాఖ మంత్రి వసుదేవ్ దేవ్నానీతో చర్చించేందుకు బజియా శుక్రవారం ఆయన ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో ఇద్దరు మంత్రుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురై బజియా.. మంత్రి దేవ్నానీపై చేయిచేసుకున్నట్లు స్థానిక మీడియా ఒకటి తెలిపింది. మరికొద్ది రోజుల్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ మంత్రుల రచ్చ కాంగ్రెస్ నేతలకు ఆయుధంగా మారినట్లయింది. ఈ ఘటన వివాదాస్పదంగా మారడంతో రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జ్ అవినాశ్ రాయ్ ఇద్దరు మంత్రులను పిలిపించి మాట్లాడినట్లు సమాచారం. కాగా.. ఈ వార్తలను బజియా తోసిపుచ్చారు. కావాలనే తనపై వదంతులు సృష్టిస్తున్నారని ఆరోపించారు.