అమరావతి, జూన్ 29 : ఏపీ కొత్త డీజీపీ ఎంపిక కసరత్తు తుది దశకు చేరింది. ఇంఛార్జ్ సీఎస్ పుఠేనా నేత్రత్వంలో.. సీనియర్ ఐఏఎస్ అధికారులు సాంబశివరావు, మన్మోహన్ సింగ్, శ్రీకాంత్లు సభ్యులుగా ఏర్పడిన సెలక్షన్ కమిటీ నివేదికను సిద్ధం చేసింది. సెలక్షన్ కమిటీ తన నివేదికను శుక్రవారం సమర్పించింది. సీనియర్ ఐపీఎస్ అధికారులు గౌతమ్ సవాంగ్, ఆర్పీ ఠాకూర్, కౌముది, అనురాధ, సురేంద్ర బాబు పేర్లతో నివేదిక ఇచ్చింది. ఈ ఐదుగురు అధికారుల ట్రాక్ రికార్డు, సర్వీస్ వివరాలతో నివేదికను రూపొందించింది. అయితే, సెలక్షన్ కమిటీ నివేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ఐదుగురిలో ఎవరిని సీఎం చంద్రబాబు కొత్త పోలీస్బాస్ను ఎంపిక చేస్తారనే అంశం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత డీజీపీ ఎం.మాలకొండయ్య ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. వాస్తవానికి ఈ ఎంపిక వ్యవహారం కేంద్రం చూసుకునేది. కాని గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఓ ఆర్డినెన్స్ను తీసుకొచ్చింది. దాని ప్రకారం ఎంపిక బాధత్యను రాష్ట్రంలోనే చూసుకునే విధంగా మార్పులు చేసింది. ఐదుగురి పేర్లు జాబితాలో ఉన్నా.. డీజీపీ రేసులో విజయవాడ సీపీ గౌతమ్ సవాంగ్, ఏసీబీ డీజీ ఆర్పీ ఠాకూర్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.