శ్రీలంక, మే 25 : శ్రీలంకలో వరదల కారణంగా 90 మంది నిండు ప్రాణాలను కోల్పోయారు.ఈ నేపధ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో ఆ దేశానికి అండగా ఉంటామని తన ట్విటర్ ఖాతాలో తెలిపారు. శ్రీలంకలో గత కొన్ని రోజులుగా వరదలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. వరదలు చాలా వేగంతో ముంచుకు రావడంతో గందరగోళమైన పరిస్థితి చోటు చేసుకున్నది. కొండచరియలు విరిగి పడడంతో అక్కడి ప్రజలకు గురువారం నుండి విపత్కర పరిస్థితి నెలకొంది. వరదల కారణంగా ఇప్పటికే 90 మంది మృత్యువాత పడ్డారు. గల్లంతయిన మరో 110 మంది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కొన్ని వందల సంఖ్యలో ఇళ్ళు ద్వంసమైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు సహాయక చర్యలు చేపట్టారు. భారత దేశ నావికాదళానికి చెందిన రెండు నౌకలు వైద్య పరికరాలు, ఔషధాలు, పునరావాస సామగ్రితో ఆ దేశానికి వెళ్ళి సహాయక కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నాయి.