విజయవాడ, జూన్ 28 : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంద్రకీలాద్రిపై వెలసిన విజయవాడ కనకదుర్గ అమ్మవారిని గురువారం దర్శించుకున్నారు. కుటుంబసమేతంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి చేయించిన ముక్కుపుడకను నెత్తిన పెట్టుకుని మేళతాళాల మధ్య కేసీఆర్ ఆలయంలోనికి ప్రవేశించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కేసీఆర్ ముక్కపుడకను కనకదుర్గ అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు కేసీఆర్ గోత్ర నామాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ సతీమణి, కోడలు, మనవలు, పలువురు బంధువులు, తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ రాక సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఇంద్రకీలాద్రిపై పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.