అమరావతి, జూన్ 26 : ఏపీ పంచాయతీ రాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎంపీ రమేశ్, ఎమ్మెల్సీ బీటెక్ రవి చేస్తున్న నిరాహార దీక్ష ఏడో రోజుకు చేరుకున్నా కేంద్రం ఇంతవరకు స్పందించకపోవడాన్ని ఆయన దుయ్యబట్టారు. కడప ఉక్కు... ఆంధ్రుల హక్కని మంత్రి నారా లోకేశ్ మరోసారి పునరుద్ఘాటించారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీ నెరవేర్చాలంటూ ఆయన ట్విటర్ ద్వారా డిమాండ్చేశారు. ఆంధ్రుల పట్ల బీజేపీ వైఖరి మరోసారి బయటపడిందని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మనోభావాలు దెబ్బతీయడం మంచిది కాదని.. రాష్ట్ర బీజేపీ నాయకులు ఇకనైనా అసత్య ప్రచారాలు మానుకోవాలని కోరారు. ఆ పార్టీ నేతలు రాష్ట్రంలో అసత్య ప్రచారాలు మానేసి ఢిల్లీలో యాత్రలు చేస్తే బాగుంటుందని ఆయన తెలిపారు.