పాక్ పని పట్టారు..

SMTV Desk 2018-06-24 10:45:17  Champions Trophy Hockey 2018, india vs pakistan hockey, Champions Trophy Hockey 2018, ramandeep singh

నెదర్లాండ్స్‌, జూన్ 24 : ప్రతిష్ఠాత్మక చాంపియన్స్‌ ట్రోఫీని భారత జట్టు ఘనంగా ఆరంభించింది. అటు అటాకింగ్‌లో ఇటు డిఫెన్స్‌లో అదరగొట్టిన భారత్‌ 4-0తో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. మ్యాచ్ మొదట నుండి ఆధిపత్యం చెలాయించిన భారత్ జట్టు.. ఆఖరి ఐదు నిమిషాల వరకు 1-0తో ఆధిక్యంలో ఉండగా.. ఆ తర్వాత పాక్ ను బేజారెత్తిస్తూ వెంటవెంటనే మూడు గోల్స్‌తో చెలరేగింది. భారత్‌ తరఫున రమణ్‌దీప్‌ సింగ్‌ (26వ నిమిషంలో), దిల్‌ప్రీత్‌ సింగ్‌ (54వ ని.లో), మన్‌దీప్‌ సింగ్‌ (57వ ని.లో), లలిత్‌ ఉపాధ్యాయ్‌ (60వ ని.లో) తలా ఓ గోల్‌ చేశారు. కామన్వెల్త్‌ గేమ్స్‌లో దారుణ పరాభవం తర్వాత కోచ్‌ హరేంద్ర సింగ్‌ ఆధ్వర్యంలో బరిలోకి దిగిన శ్రీజేశ్‌ సేన అన్నివిభాగాల్లో పటిష్ఠంగా కనిపించింది. భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌లో ఆదివారం ఒలింపిక్‌ చాంపియన్‌ అర్జెంటీనాతో తలపడనుంది. శనివారం జరిగిన ఇతర మ్యాచ్‌ల్లో నెదర్లాండ్స్‌ 1–0తో అర్జెంటీనాపై నెగ్గగా... ఆస్ట్రేలియా, బెల్జియం మ్యాచ్‌ 3–3తో డ్రాగా ముగిసింది.